Showing posts with label నంద్యాల. Show all posts
Showing posts with label నంద్యాల. Show all posts

Monday, 10 February 2014

AHOBILAM

                          నంద్యాల (కర్నూలు) :


పుణ్య క్షేత్రాలు -మహానంది, అహోబిలం, యాగంటి, బెలూం గుహలు, మహానంది పుణ్యక్షేత్రం ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ముఖ్యమైనది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్రాలయం నంద్యాల పట్టణంలో నెలకొని ఉంది. 2004 వ సంవత్సరం నృసింహజయంతి నాడు ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటినుండి, దినదిన ప్రవర్ధమానమై అశేష భక్త జనాన్నీ విశేషంగా ఆకర్షించుచున్నది.
నంద్యాల చేరుకొను విధము : రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 300 కి.మీ దూరమున ఉన్నది.
ఇక్కడ దేశంలోనే రెండవ జగజ్జనని ఆలయం ఉన్నది.

నంద్యాల పట్టణానికి రైలు మరియు బస్సు సౌకర్యం రెండూ ఉన్నాయి. విశాఖపట్టణం -బెంగుళూరు మద్డ్య నదిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ మరియు గోవా-విజయవాడ మద్డ్య నడిచే అమరావతి ఎక్స్ ప్రెస్ రైల్లు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి.

నంద్యాల పట్టణములో కూడళ్ళలో గాంధీచౌకు,నూనెపళ్ళి మరియు బొమ్మలసత్రం ముఖ్యమైనవి. బొమ్మల సత్రం 18వ నంబరు జాతీయరహదారిని ఆనుకొని ఉంది. కర్నూలు వైపు నుండి నంద్యాల పట్టణములో ప్రవేశించేవారికి బొమ్మలసత్రం ముఖద్వారం. బొమ్మల సత్రము పక్కనే కుందేరు నది ప్రవహిస్తూ ఉన్నది.

ప్రతి రోజూ నంద్యాల నుండి హైదెరాబాద్ కు రాత్రి ప్రైవేటు రవాణా సంస్థలు బస్సులను నడుపుతాయి.

అహోబిలం


అహోబిలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. 

నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. 

 ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.

రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. 
 


ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్ధం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. 

ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపం నందు వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

ఎగువ అహోబిలం గోపురం
ఎగువ అహోబిలము :
ఎగువ అహోబిలం నందు వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము కలదు.
దిగువ అహోబిలము:
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

వసతి సౌకర్యాలు

అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నవి.
  • తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిధి గృహములో ఉండవచ్చు
  • లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
  • దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు.
  • ఇక్కడ ఆంథ్ర ప్రదేశ్ ప్రభుత్వ టూరిజం వారి భోజన హోటల్ కలదు.

చేరుకొను విధము

  • రోడ్డు మార్గము: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.
  • రైలు మార్గము:అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల

నవ నారసింహ గుళ్ళు

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు
   జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
   యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః

మాలోల నరసింహస్వామి ఆలయం

నవ నారసింహ ఆలయములకు వెళ్ళు మట్టిదారి
అనగా
  1. జ్వాలా నరసింహ
  2. అహోబిల నరసింహ: గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి.
  3. మాలోల నరసింహ: లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి
  4. క్రోద నరసింహ (వరాహ నారసింహ)
  5. కారంజ నరసింహ
  6. భార్గవ నరసింహ
  7. యోగానంద నరసింహ
  8. క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ)
  9. పావన నరసింహ
అను తొమ్మిది నరసింహ దేవాలయములు ఈ క్షేత్రమున కలవు. ఇప్పుడే కొద్దికొద్దిగా రోడ్డుమార్గములు వేస్తున్నరు అన్నీ నడచిపోవాలంటే మీకు రెండు రోజులు పడుతుంది. జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానంచేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

photos : 
http://maagodavari.blogspot.in/2011/09/blog-post_12.html