Friday 13 May 2016

అఱుపడై వీడుగళ్


ఓం
తమిళనాడు పేరు స్పురణకు రాగానే ఎత్తైన రాజగోపురాలతో, విశాలమైన ఆలయ ప్రాంగణాలతో , అక్కడ పుణ్యక్షేత్రాలు కళ్ళముందే కనిపిస్తాయి . ఎన్నిసార్లు చూసిన తనివితీరని ఆ నిర్మాణాలు ఆలయ విశేషాలు , ఆలయ ప్రాంగణాలు, కాలం తో పాటు పరుగు పేడుతున్న కూడా కట్టు బట్టు వదలని అక్కడ ప్రజలు . నిజంగా వాళ్ళ వస్త్రదారణ చూడగానే మన/వాళ్ళ  సంప్రదాయాన్ని వీళ్ళు బాగా పాటిస్తారు . మనం ఐతే పెంట్లాలో దూరిపోయం కాని ఇక్కడ వాళ్ళు మాత్రం పంచేలను ధరించడం ముచ్చటేస్తుంది .



తమిళనాడు రాజముద్ర పై కూడా ఆలయ గోపురం ఉంటుంది . ఇక్కడ చాలానే ప్రసిద్ధి చేందిన దేవాలయాలూన్నాయి. వాటిలో కాంచీపురం , రామేశ్వరం , అరుణాచలం , మధురై , కన్యాకుమారి , శ్రీరంగం , పళని , తంజావూర్ మనవాళ్ళకి సుపరిచితమే, వెళ్లి దర్శించకపోయిన పేరు వినగానే గుర్తుపడతారు . 

తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉన్నది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.
 
తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది.

 మన తెలుగువాళ్ళ ఇలవేల్పు వేంకటేశ్వరుడైతే ఇక్కడవాళ్ళకు సుబ్రమణ్యుడనే చేప్పాలి. తిరుమల వచ్చినప్పుడు చాలామంది దగ్గరలో ఉన్న క్షేత్రాలను దర్శిస్తుంటారు, వాటిలో తిరుపతి కి దగ్గర్లోనూన్న సుబ్రహ్మణ్యుడు ఆలయం తిరుత్తణి కూడా వెళ్తుంటారు . తమిళ ప్రజలు మురుగన్పేరుతోనే స్వామిని ఇక్కడ పిలుచుకుని పూజిస్తారు. మురుగన్ అంటే మేనల్లుడు అని అర్ధం , విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ అని పిలుస్తారు .  తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి



అవి వరుసగా
1.తిరుచెందూర్
2. తిరుప్పరంకుండ్రం
3.  పళముదిర్చొళై
4. పళని
5.  స్వామిమలై
6.  తిరుత్తణి



తిరుచెందూర్ :
ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. కుమారస్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తారు . సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొలువై ఉన్నాడు. 
తిరుప్పరంకుండ్రం:
ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.

పళముదిర్చొళై :
ఈ క్షేత్రం మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు.
పళని:
ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.

స్వామిమలై:
ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు.

తిరుత్తణి:
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తిఅనే ఈటెను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడుఅనే పేరొచ్చింది.

వచ్చే ఆర్టికల్ లో మనం ఒక్కో ఆలయం కోసం ఆ ఆలయం స్థలపురాణం , ఏలా చేరుకోవాలి , చుట్టుప్రక్కలా చూడదగిన పుణ్యక్షేత్రాలు వాటికోసం తెల్సుకుందాం .